హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో కొందరు అధికారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రేటు కట్టి పౌర సేవలు.. బిల్లుల రూపకల్పన నుంచి చెల్లింపుల వరకు పర్సంటేజీలు.. అనుమతులు, నివాసయోగ్య పత్రాల జారీకి తీసుకునే అమ్యామ్యాలు చాలవన్నట్టు.. బల్దియా ఖజానాకు కన్నం వేస్తున్నారు. సొంత కార్లను అద్దె వాహనాలుగా చూపి దోచుకుంటున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో వివరాలను పరిశీలించిన రవాణా విభాగం అధికారులు 26మందికి నోటీసులు జారీ చేశారు.
– జీహెచ్ఎంసీలో 26 మంది అధికారులకు నోటీసులు
– ఈ తరహా వాహనాలపై ఆరా..
ఏ వాహనాలు వినియోగిస్తున్నారు..? అవి సొంతమా..? ట్యాక్సీ ప్లేట్ వాహనాలా..? వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇందులో ఇంజనీరింగ్, పట్ణణ ప్రణాళికా, యూసీడీ, పారిశుధ్య నిర్వహణ తదితర విభాగాల అధికారులున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ డ్రైవర్ కమ్ ఓనర్ (డీఓసీ) పథకంలో భాగంగా గతంలో 400లకుపైగా కార్లను బ్యాంకు రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు అందించింది.
కొందరు అధికారులు డీఓసీ డ్రైవర్లను వేధించి.. తమ వద్ద పని చేయకుండా చేశారు. అనంతరం సొంత కార్లను అద్దె వాహనాలుగా వినియోగిస్తూ వచ్చారు. జీహెచ్ఎంసీలో దాదాపు 800 మంది అధికారులకు వాహన సదుపాయం ఉంది. ఇందులో సంస్థ సొంత, అద్దె వాహనాలున్నాయి. ప్రాథమిక పరిశీలనలో గుర్తించిన 26 మందికి నోటీసులు ఇవ్వగా.. కేంద్ర, జోనల్, సర్కిల్ కార్యాలయాల పరిధిలో సొంత కార్లను అద్దె వాహనాలుగా ఎంత మంది వినియోగిస్తున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు.
సొంత నంబర్ ప్లేట్ వాహనాలు ఎంత మంది వాడుతున్నారు..? వాటిలో అద్దె ఎన్ని వాహనాలకు చెల్లిస్తున్నారన్నది గుర్తిస్తే అక్రమాలు బయటపడుతాయని ఓ అధికారి తెలిపారు. సొంత కార్లను అద్దె వాహనాలుగా చూపుతోన్న అధికారులు 80 మందికిపైగా ఉంటారని రవాణా విభాగం వర్గాలు చెబుతున్నాయి. వీరికి నెలకు రూ.27.20 లక్షల చొప్పున యేటా రూ.3.26 కోట్లు చెల్లిస్తున్నారు.