ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణువుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక ప్రాంతాలు, నగరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకూ 585 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల సంఘాలు తాజాగా తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 239 మంది టెహ్రాన్ వాసులు కాగా, 126 మంది భద్రతా సిబ్బంది, ఉన్నత అధికారులు ఉన్నట్లు సమాచారం.
టెహ్రాన్ ఖాళీ చేయండి: ఇజ్రాయెల్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున నివసిస్తున్న దాదాపు 3.30 లక్షల మందిని ఖాళీ చేయాలని ఇజ్రాయెలీ సైన్యం అంతకుముందు పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో అతి పెద్ద నగరాలలో ఒకటైన టెహ్రాన్లో దాదాపు కోటి మంది నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ జనాభాకు ఇది దాదాపు సరిసమానం.
బంకర్ బస్టర్ ఇవ్వండి..
ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు తమకు ‘14వేల కిలోల బంకర్ బస్టర్’ బాంబులను ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరినట్టు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయగా, ఫోర్డో అణు శుద్ధి కర్మాగారాన్ని మాత్ర ధ్వంసం చేయలేకపోయింది. పర్వతప్రాంతాల్లో భూగర్భంలో నిర్మించిన ఈ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్ను వాడాలని ఇజ్రాయెల్ భావిస్తున్నది. అమెరికా వద్ద ఉన్న ఈ బాంబ్ను ‘ఎంవోపీ’గా పిలుస్తారు. ఇది 200 అడుగుల బలమైన శిలను తుత్తునియలు చేయగలదు.
ఇరాన్లో అత్యంత రహస్యంగా, సురక్షితంగా నిర్వహిస్తున్న అణు స్థావరం నటాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్పై ఇజ్రాయెల్ అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించింది. భూగర్భంలో అత్యంత లోతులో ఉన్న నటాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్లు ఐక్య రాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) మంగళవారం వెల్లడించింది. భూమి లోపల ఎంతో లోతులో నిర్మించిన ఈ స్థావరాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడం ఇజ్రాయెల్కు సాధ్యం కాదని గతంలో అనేక దేశాలు భావించాయి. నటాంజ్ యురేనియం శుద్ధి కర్మాగారంలోని భూగర్భ విభాగాన్ని ఇజ్రాయెల్ నేరుగా కొట్టినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఐఏఈఏ తెలిపింది.