పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఈ దాడుల్లో ఇరాన్కు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.
ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటికే పలువురు కీలక నేతలను ఇరాన్ కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. సోమవారం రాత్రి మంగళవారం తెల్లవారుజామున మధ్య టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న కమాండ్ సెంటర్పై తాము జరిపిన దాడుల్లో అలీ షాద్మానీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ సాయుధ దళాలు.. ఈ రెండింటికీ నాయకత్వం వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇరాన్పై శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాక్తో 1980లో జరిగిన భీకర యుద్ధం తరువాత తిరిగి ఆ స్థాయిలో దాడులను ఎదుర్కోవడం ఇరాన్కు ఇదే మొదటిసారి. ఈ దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్ మొహమ్మద్ బాఘేరి, రెవెల్యూషనరీ గార్డ్స్ జనరల్ హొస్సేన్ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమం అధికారి జనరల్ అమీర్ అలీ హాజీజాదే, పలువురు శాస్త్రవేత్తలు, ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్ ఘోలంరేజా మెహ్రాబీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ మరణించిన విషయం తెలిసిందే.
– బంకర్లో దాక్కొన్న ఖమేనీ
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆయన కుటుంబం టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని ఒక బంకర్లో దాక్కొన్నారని తెలిసింది. యురేనియాన్ని శుద్ధి చేసుకొనే కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసేందుకు ఖమేనీకి ఇజ్రాయెల్ చివరి అవకాశమిచ్చిందని.. అందువల్లే దాడులు జరిగిన మొదటి రోజైన శుక్రవారం రాత్రి ఆయనను హత్య చేయకుండా వదిలేసిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.