ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. ఒకరిపై ఒకరు క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో పలు దేశాలు తమ పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేస్తున్నాయి.
భారతీయులు (Indians) తక్షణమే టెహ్రాన్ (Tehran)ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ (Advisory) జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో వీలైనంత త్వరగా నగరాన్ని వీడాలని ఆదేశించింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం అత్యవసర హెల్ప్లైన్ను కూడా ఏర్పాటు చేసింది (+989010144557, +989128109115, +989128109109).
మరోవైపు టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సూచించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అన్నారు. మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో సమస్యను తగ్గించుకోవాలని సూచించారు. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
టెహ్రాన్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ దాడి
మరోవైపు టెహ్రాన్ ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్కు చెందిన రెండు F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోని ఐడీఎఫ్ దళాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాయి. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు టెహ్రాన్ వీటిని ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. తమ దాడిలో ఆ ఫైటర్ జెట్స్ పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించింది.
మరోవైపు, తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కానందున ఇరాన్లోని ఆయుధాగారాల సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరించింది. ఇరాన్తో సైనిక ఘర్షణలు ప్రారంభమైన నాలుగవ రోజు సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై తమకు పట్టు చిక్కిందని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించింది. ఏ విధమైన సవాళ్లు లేకుండా టెహ్రాన్ గగనతలంపై తమ యుద్ధ విమానాలు విహరించగలవని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్పై తమపై జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడిలో ఇప్పటి వరకు 24 మంది మరణించగా 500 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్కు చెందిన 120కి పైగా క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.