వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అన్నారు. మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో సమస్యను తగ్గించుకోవాలని సూచించారు. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదు. ఇప్పటికే పదే పదే చెప్పా. అందరూ టెహ్రాన్ను ఖాళీ చేయాలి’ అంటూ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో పోస్టు చేశారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ అంతం చేస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం త్వరంగా ముగింపు పడుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, ట్రంప్ తన కెనడా పర్యటనను ముందుగానే ముంగించుకుని అమెరికాకు బయల్దేరారు.
అంతకుముందు ఇజ్రాయెల్తో ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణల్లో ఇరాన్ గెలవలేదని, సమయం మించిపోక ముందే ఆ రెండు దేశాలు చర్చలు చేపట్టాలని ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో ట్రంప్ ఈ సూచన చేశారు. అమెరికా ఆస్తులపై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టకూడదని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ తమ ఆస్తులపై ఏ రూపంలోనూ దాడులు చేయడానికి వీల్లేదని, ఒకవేళ అదే జరిగితే గతంలో ఎన్నడూ చూడని రీతిలో అమెరికా సాయుధ దళాలు ఇరాన్పై విరుచుకుపడతాయని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్పై ఇరాన్ 100కుపైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో 8 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా ఎంబసీని తాకింది. దీంతో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నది. మరోవైపు, తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కానందున ఇరాన్లోని ఆయుధాగారాల సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరించింది.