Tuesday, June 17, 2025
ads
Homeక్రైమ్క్షిపణుల వర్షం.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ భీకర దాడులు

క్షిపణుల వర్షం.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ భీకర దాడులు

– ఇరాన్‌ దాడుల్లో 8 మంది మృతి
– టెల్‌ అవీవ్‌లోని అమెరికా ఎంబసీ స్వల్పంగా ధ్వంసం
– అణు ఒప్పందానికి టెహ్రాన్‌ గుడ్‌బై!

దుబాయ్‌,: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. వరుసగా నాలుగో రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ సోమవారం తెల్లవారుజామున జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారు. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్‌ అవీవ్‌లోని అమెరికా ఎంబసీని తాకింది. దీంతో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఓ అధికారి తెలిపారు. మరోవైపు, తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కానందున ఇరాన్‌లోని ఆయుధాగారాల సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్‌ తాజాగా హెచ్చరించింది. ఇరాన్‌తో సైనిక ఘర్షణలు ప్రారంభమైన నాలుగవ రోజు సోమవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ గగనతలంపై తమకు పట్టు చిక్కిందని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించింది. ఏ విధమైన సవాళ్లు లేకుండా టెహ్రాన్‌ గగనతలంపై తమ యుద్ధ విమానాలు విహరించగలవని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇరాన్‌పై తమపై జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడిలో ఇప్పటి వరకు 24 మంది మరణించగా 500 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇరాన్‌కు చెందిన 120కి పైగా క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ఐఆర్‌ఐబీ ప్రధాన కార్యాలయంపై సోమవారంం ఇజ్రాయెల్‌ బాంబు దాడి చేయడంతో ప్రత్యక్ష ప్రసారంలో ఉన్న టీవీ యాంకర్‌ ప్రాణ రక్షణ కోసం పరుగులు తీయాల్సి వచ్చింది. బాంబు దాడి కారణంగా పీఐబీ కార్యాలయం నల్లని దట్టమైన పొగతో నిండిపోయింది.

– ఒప్పందం నుంచి వైదొలుగుతాం..
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ) నుంచి వైదొలగేందుకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఓ బిల్లును రూపొందిస్తున్నదని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. అయితే భారీ విధ్వంసక ఆయుధాల తయారీ పట్ల ఇరాన్‌ వ్యతిరేకత కొనసాగుతుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. అణ్వస్ర్తాలను తయారుచేసే ఉద్దేశం ఇరాన్‌కు లేదని, అయితే అణు ఇంధనం, పరిశోధనపై తన హక్కును కొనసాగిస్తుందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ అంతకుముందు ప్రకటించారు. విధ్వంసక ఆయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్‌ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ తీసుకున్న మతపరమైన నిర్ణయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. అణ్వస్ర్తాలను, సంబంధిత టెక్నాలజీల వ్యాప్తిని నిరోధించేందుకు గతంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ) అంతర్జాతీయంగా ఏర్పడింది. ఇజ్రాయెల్‌తో ఘర్షణ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఎన్‌పీటీ నుంచి వైదొలగాని ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాల్పుల విరమణకు ఇరాన్‌ ఒత్తిడి
ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ చేసే విధంగా అమెరికాపై ఒత్తిడి పెంచాలంటూ గల్ఫ్‌ దేశాల ద్వారా ఇరాన్‌ ప్రయత్నాలు సాగిస్తున్నది. ఇరాన్‌తో ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకు రావాలని ఖతార్‌, సౌదీ అరేబియా, ఒమన్‌లను ఇరాన్‌ ప్రభుత్వం కోరినట్టు ‘రాయిటర్స్‌’ కథనం పేర్కొన్నది.

ఇరాన్‌లో వరుస కారు బాంబు పేలుళ్లు
ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ ఏకకాలంలో వరుస కారు బాంబులను పేల్చివేసినట్లు ఇరాన్‌ వెల్లడించింది. శనివారం జరిగిన ఈ దాడులలో ఆరుగురు అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది.

మాపై అణుబాంబు వేస్తే పాక్‌ ప్రతిదాడి!
తమ దేశంపై ఇజ్రాయెల్‌ అణ్వస్ర్తాలను ప్రయోగిస్తే పాకిస్థాన్‌ ఇజ్రాయెల్‌పై అణు బాంబు వేస్తుందని ఇరాన్‌ సీనియర్‌ అధికారి జనరల్‌ మొహసీన్‌ ర రెజేయీ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను పాక్‌ ఖండించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ తన అణు బాంబును ఉపయోగిస్తే తాము కూడా ఇజ్రాయెల్‌పై అణు బాంబు వేస్తామని పాకిస్థాన్‌ తమకు చెప్పిందని ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సభ్యుడు, ఐఆర్‌జీసీ కమాండర్‌ అయిన మొహసిన్‌ ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌ తోసిపుచ్చారు.

– ఎటూ గెలిచేది లేదు.. సంధి చేసుకోండి
– ఇరాన్‌కు ట్రంప్‌ హితవు

ఇజ్రాయెల్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణల్లో ఇరాన్‌ గెలవలేదని, సమయం మించిపోక ముందే ఆ రెండు దేశాలు చర్చలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో ట్రంప్‌ ఈ సూచన చేశారు. అమెరికా ఆస్తులపై ఇరాన్‌ ప్రతీకార దాడులు చేపట్టకూడదని కూడా ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ తమ ఆస్తులపై ఏ రూపంలోనూ దాడులు చేయడానికి వీల్లేదని, ఒకవేళ అదే జరిగితే గతంలో ఎన్నడూ చూడని రీతిలో అమెరికా సాయుధ దళాలు ఇరాన్‌పై విరుచుకుపడతాయని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments