కోల్కతా: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ మంగళవారం తెల్లవారుజామున కోల్కతాలో విమానాన్ని నిలిపివేశారు. దీంతో భద్రత దృష్ట్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానంలోని ఇంజిన్లలో ఒకటి పనిచేయడం లేదని, దీంతో విమానం ఎగరడంలో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానం కోల్కతా నుంచి ముంబై వెళ్లడానికి ఆలస్యమవుతుందని వెల్లడించారు.
ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సోమవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ రకానికి చెందిన ఏఐ 315 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. కాగా, గత గురువారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.