హైదరాబాద్: వేధింపులతో సాధించేమీ లేదని, అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి మీకు ధైర్యం ఉంటే లైడిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని, విచారణలు.. కమిషన్లు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. తమకు చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని.. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. తెలంగాణ కోసం ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చానని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యేందకు తెలంగాణ భవన్ నుంచి బయల్దేరేముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘నిజం నిలకడ మీద తెలుస్తుంది. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉంది. కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాం. విచారణకు పిలవడం ఇది మూడోసారి. మూడుసార్లు కాదు.. 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, కమిషన్లు వేసి మమ్మల్ని వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించకుండా బంద్చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం అజ్ఞానం అవుతుంది తప్పా ఇంకొకటి కానేకాదు.
కేసీఆర్, హరీశ్ రావును కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను మళ్లీ ఏసీబీ విచారణకు పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారు. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు, కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చాను. ఫార్ములా ఈ రేసులో తెలంగాణను ప్రపంచంలో నంబర్ వన్ చేశాం. మీరు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు నెరవేర్చే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో తీసుకున్న నిర్ణాయాల నుంచి వెనక్కి తగ్గం.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇచ్చిన 420 హామీలు, దొంగ ఆరు గ్యారెంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లను అమలుచేయాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోందని సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి తీరును గమనిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇప్పుడు వాటిని విస్మరించి స్థానిక సంస్థలకు వెళ్తోంది. బీసీ ప్రజలు వీటిని గమనిస్తున్నారు. రైతుబంధును ఎలక్షన్ బందుగా మార్చి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు రూ.2500 ఎగ్గొట్టిన విషయాన్ని రాష్ట్ర మహిళలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నువ్వు చేసిన మోసాన్ని నిరుద్యోగులు యువత గమనిస్తున్నారు.
రేవంత్ రెడ్డి దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడు. ఏదో ఒక కమిషన్, ఎంక్వయిరీ అంటూ కాలయాపన చేస్తున్నాడు. కాంగ్రెస్, బీజేపీ దొంగనాటకాలు, దొంగ బాగోతం అంతా తెలంగాణ ప్రజలకు అంతా అర్థమయింది. ఒక కేసు కాదు ఇంకా వెయ్యి కేసులు పెట్టినా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మాలో ఒకరిద్దరినీ జైలులో పెట్టొచ్చు. కానీ లక్షలమంది కేసీఆర్ సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం మీకు లేదు. తెలంగాణకు ఆనాడు రక్షణ కోసం టీఆర్ఎస్.. నేడు బీఆర్ఎస్. విచారణకు వందసార్లు పిలిచినా వస్తా.. వందసార్లు నిజమే చెబుతా. రేవంత్ రెడ్డి.. మీకు ధైర్యం ఉంటే లైడిటెక్టర్ పరీక్షకు రా. వేధింపులతో సాధించేమీ లేదు. అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నాం’ అని కేటీఆర్ చెప్పారు.