కాలచక్రంలో గ్రహగతులు ఒక్కోసారి విపత్కర పరిస్థితులు కల్పిస్తాయి. ఊహించని ఉపద్రవాలను సృష్టిస్తాయి. మొన్నటి పహల్గాం ఘటన, నిన్నటి ఆపరేషన్ సిందూర్, ఆపై సీజ్ఫైర్ వీటన్నిటికీ ఖగోళంలో చోటు చేసుకున్న పరిణామాలు కారణంగా కనిపిస్తున్నాయని జ్యోతిశ్శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలసర్ప దోష ప్రభావం యుద్ధానికి దారితీసిందని లెక్కలు కడుతున్నారు. అయితే, సీజ్ఫైర్ తాత్కాలికమేనని.. రానున్న రోజుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని కూడా విశ్లేషిస్తున్నారు.
జ్యోతిశ్శాస్త్ర రీత్యా కాలసర్పయోగాన్ని దోషంగా పరిగణిస్తారు. గ్రహాలన్నీ రాహువు, కేతువు మధ్య చిక్కుబడిపోతే.. దాన్ని కాలసర్పదోషంగా చెబుతారు. ఇది ఏర్పడినప్పుడు.. రాజ్యమంతా రాహుకేతువులదే! మిగతా గ్రహాల శక్తి దాదాపు నిర్వీర్యం అవుతుంది. ఈ ఉగాది నుంచి కాలసర్పదోషం నెలలో పక్షం రోజుల పాటు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 25వ తేదీ తెల్లవారుజాము నుంచి ఇది మరింత బలంగా ఏర్పడింది. ఇది, మే 9 వరకు కొనసాగింది. కేతువు ఛాయలో చంద్రుడు ఉన్న సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. మే 10 వరకు కూడా దోషం కొనసాగింది. ఈ మధ్యకాలంలోనే భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుకున్నట్టుగానే, పదో తేదీ సాయంత్రం కాల్పుల విరమణకు ఇరుదేశాలూ అంగీకారం తెలిపినట్టుగా ప్రకటన వెలువడింది.
జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. కాలసర్పదోష ప్రభావాన్ని కొట్టిపారేయలేమని జ్యోతిశ్శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పహల్గాంలో ముష్కరులు అమాయకులైన పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయాన్ని విశ్లేషిస్తే.. చంద్రుడు యుద్ధ కాముకుడైన కుజుడి నక్షత్రంపై ఉన్నాడు. ఆ కుజుడు.. తన శత్రు గ్రహమైన శని నక్షత్రంపై నీచపొంది ఉన్నాడు. దీనికితోడు పాపగ్రహమైన రాహువు, బలవంతుడైన శనిని దాటుకొని మరింత బలాన్ని సంతరించుకొని కాలసర్పదోషాన్ని ఆహ్వానించడానికి సిద్ధమయ్యాడు. లోతుగా పరిశీలిస్తే.. ఆ ఘటన జరిగిన సమయానికి చంద్రుడు కుజ నక్షత్రంలో రాహు పాదంపై సంచరిస్తున్నాడు. ఫలితంగా పహల్గాం నెత్తురోడింది. తర్వాత రెండు రోజులకే కాలసర్పదోషం యాక్టివేట్ అయింది. తర్వాత పక్షం రోజులకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ సమయానికి కాలసర్పదోషం పూర్తిస్థాయిలో పనితనం చూపడం మొదలుపెట్టింది. భారత కాలమానం ప్రకారం మన సైన్యం ఆరో తేదీ, అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 (మే 7) నిమిషాలకు పరాక్రమ సిందూరానికి శ్రీకారం చుట్టింది. ఆ సమయాన్ని బట్టి.. లగ్నంపై కుజుడి దృష్టి ప్రభావవంతంగా పనిచేసింది. అప్పుడు కూడా చంద్రుడు శుక్ర నక్షత్రంపై, కుజ పాదంలో సంచరించడం వల్ల యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు మూడు రోజుల పాటు ఇరుదేశాల మధ్య యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు.
పదో తారీఖున సాయంత్రం 5 గంటల నుంచి ఉభయదేశాలూ కాల్పుల విరమణ పాటిస్తాయన్న ప్రకటన సమయానికి కాలసర్పదోష ప్రభవం కాస్త సన్నగిల్లింది. అయినప్పటికీ, ఆ రాత్రి, మర్నాడు ఉదయం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. చంద్రుడు… కుజ, రాహు నక్షత్రాల మీదుగా సంచరించడం కారణంగా సీజ్ఫైర్ని అతిక్రమించి పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. అయితే, పూర్ణ చంద్రుడు కావడంతో.. 12వ తేదీ తెల్లవారుజామున బృహస్పతి నక్షత్రంలోకి ప్రవేశించి గజకేసరీ యోగం ఏర్పడటంతో ఉద్రిక్తతలు కాస్త నెమ్మదించాయి. అయితే మే 20వ తేదీ నుంచి మరోసారి కాలసర్పదోషం యాక్టివేట్ కానుంది. ఇది జూన్ 5 వరకు కొనసాగుతుంది. ఈ దరిమిలా మరోసారి ఉభయ దేశాల మధ్య తీవ్ర పరిస్థితులు నెలకొనే ప్రమాదం లేకపోలేదని జ్యోతిశ్శాస్త్రజ్ఞులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జూన్ 17 నుంచి జూలై 1వ వరకు ఏర్పడే కాలసర్పదోష సమయంలోనూ ఇదే తరహా వాతావరణం ఉండొచ్చని చెబుతున్నారు. జూలై నెలాఖరుకు కాలసర్పదోషం పూర్తి స్థాయిలో తొలగిపోనుంది. ఆ తర్వాత యుద్ధ మేఘాలు తొలగిపోతాయని వారు అంచనావేస్తున్నారు.
ఈసారి భిన్నం..
పుష్కర కాలంలో దాదాపు ఏడెనిమిదేండ్లు ఈ కాలసర్పదోషం ఏర్పడుతూ ఉంటుంది. చంద్రుడి సంచారాన్ని బట్టి దోషం యాక్టివేట్, డీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలా దోషం ఏర్పడినప్పుడల్లా యుద్ధాలు జరుగుతాయని చెప్పడం సరికాదు. కానీ, ఈసారి శని, రాహువులు అత్యంత సమీపంగా కదలడం, ఆ సమయంలోనే కుజుడు నీచ పొంది ఉండటం వల్ల.. తీవ్రత పెరిగింది. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలోనూ అర్ధ కాలసర్ప దోషం ఉంది. ఈ సమయంలో శని నీచ పొందడం, శనిపై కుజుడి వక్ర దృష్టి సోకడంతో అప్పటి పరిస్థితులు తీవ్ర యుద్ధానికి దారితీశాయి.