పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలోనే ఈ క్షిపణులకున్న శక్తి గురించి ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. దీని ప్రభావం గురించి తెలియని వారెవరైనా ఉంటే.. పాకిస్థాన్ను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
భారత్ , పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ యూపీ లోని లక్నో సిటీలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. లక్నోలోని ‘ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’లో నిర్మించిన ఈ కేంద్రాన్ని రాజ్నాథ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని మాట్లాడారు.
ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని సీఎం యోగి తెలిపారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్లో ఏటా 80 నుంచి 100 క్షిపణులను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణులు 290 నుంచి 400 కి.మీ పరిధిని, మాక్ 2.8 రెట్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. ఇక ఇదే కార్యక్రమంలో ఉగ్రవాదం గురించి కూడా సీఎం యోగి మాట్లాడారు. ‘ఉగ్రవాదం కుక్కతోక లాంటిది. అది ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. దాన్ని సరిచేయాలంటే వారి సొంత భాషలోనే బదులివ్వాలి’ అని వ్యాఖ్యానించారు.
బ్రహ్మోస్ క్షిపణి గురించి..
భారత్, రష్యాల సంయుక్త వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు.
కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్ క్షిపణి బరువు 1290 కిలోలు.