సోవియట్ కాలం నాటి అంతరిక్ష నౌక కాస్మోస్ 482 స్పేస్క్రాఫ్ట్ ఎట్టకేలకు భూమిపై పడిపోయింది. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన కాస్మోస్ విఫలమై అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 53 సంవత్సరాల తర్వాత మళ్లీ భూమిని తాకింది. ఈ విషయాన్ని రష్యన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ ధ్రువీకరించాయి. హిందూ మహాసముద్రం మీదుగా పడిపోయిందని రష్యా తెలిపింది. అయితే, పలువురు నిపుణులు మాత్రం ఎక్కడ పడిపోయిందో ఖచ్చితంగా గుర్తించలేకపోయినట్లు నిపుణులు పేర్కొన్నారు. 1972లో సోవియట్ యూనియన్ శుక్రగ్రహంపై చేపట్టిన మిషన్ కాస్మోస్ 482. ఈ ప్రయోగం విఫలం కావడంతో సుమారు 500 కిలోల బరువున్న ఈ అంతరిక్ష నౌక భూ కక్ష్యలోనే ఉండిపోయింది. దాదాపు సుమారు అర దశాబ్దానికి పైగా అంతరిక్షంలో చక్కర్లు కొట్టింది ఈ శాటిలైట్.
అయితే, కాస్మోస్ విడి భాగాల్లో చాలా వరకు విడిపోయి భూమిపై పడిపోయాయి. సౌర కుటుంబంలోని అత్యంత వేడిగా ఉండే శుక్రగ్రహంపై ప్రయోగం చేపట్టేందుకు కాస్మోస్కు టిటానియం రేకు రక్షణగా ఉండడంతో చెక్కుచెదరలేదని నిపుణులు పేర్కొంటున్నారు. శనివారం అంతరిక్ష నౌక ఎలాంటి నియంత్రణ లేకుండా భూమి వాతావరణంలోకి ప్రవేశించిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఎక్కడ పడిపోతుందో ఖచ్చితమైన సమాచారం లేదని నిపుణులు చెప్పారు. అయితే, యూరోపియన్ యూనియన్ స్పేస్ సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ అంతరిక్ష నౌక ఇకపై భూమి కక్ష్యలో లేదని పేర్కొంది. అదే సమయంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ ఆఫీస్ కూడా అంతరిక్ష నౌక తిరిగి భూమి కక్షలోకి వచ్చినట్లు చెప్పింది. జర్మన్ రాడార్ స్టేషన్లో కనిపించకపోవడంతో అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఏజెన్సీ తెలిపింది.