సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని నందినగర్ నుంచి బయల్దేరిన ఆయన.. అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాదరస్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సిద్ధమైన అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. ఇవాళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో వాడీవేడీగా అసెంబ్లీలో చర్చ జరగనుందని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం నాడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు వెలుగులోకి తెచ్చి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి గొంతుకగా ఉభయసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ ఉద్బోధించారు. ఉభయసభలు ప్రారంభమయ్యే నిర్దేశిత సమయానికి ముందే సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. బీఆర్ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, వేస్తున్న నిందలను బలంగా తిప్పికొట్టాలని చెప్పారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజా సమస్యల మీద ఉభయసభల్లో ప్రతిభావంతంగా పోరాడేందుకు, సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు వీలుగా డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. సమావేశంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.