సత్యమేవ జయతే – హైదరాబాడ్ హైదరాబాద్ : కమీషన్ తప్పా విజన్ లేని ప్రభుత్వం రేవంత్రెడ్డి ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సచివాలయంలో జరగని అత్యంత ఘోరమైన, నీచమైన ఘటన మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది. 20శాతం కమిషన్ ఇవ్వందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టులు ఆర్థికశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చాంబర్ ఎదుట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరుగలేదు. భారతదేశంలోనూ ఇలాంటి ఘటన ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఇవాళ 20శాతం కమీషన్ తప్పా.. విజన్లేని ప్రభుత్వం ఇది. ఏఐ, డేటా సైన్సెస్ అని పెద్దమాటలు చెబుతున్నరు. నో విజన్.. ఓన్లీ 20శాతం కమిషన్ అనే విధంగా ప్రభుత్వాన్ని నడుపుతూ.. ఢిల్లీకి మూటలు పంపుతూ.. ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచులను వేధించి.. చివరకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండిపెట్టకుండా పిల్లలను చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. చనిపోయిన పిల్లల గురించి ఒక్కమాట లేదు..
‘గురుకులాల్లో ఉన్న అధ్వాన్న పరిస్థితుల గురించి ఒక్క మాట చెబుతారేమోనని అనుకున్నాం. దాని గురించి ఒక్క మాట గవర్నర్ ప్రసంగంలో లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక్కమాట సానుభూతి చెప్పి.. సంతాపం చెబుతారని అనుకున్నాం. కానీ, ఒక్కమాట వారి గురించి ప్రస్తావన లేదు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు 4.17లక్షల కోట్ల అప్పు చేస్తే.. అప్పులు అప్పులు అని గుండెబాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు.. ఒకే సంవత్సరం 1.62లక్షలకోట్లు అప్పు తెచ్చిన విషయంపై చెబుతారేమోనని అనుకున్నాం. సరే కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తెలంగాణకు బలమైన పునాది వేయాలని.. బ్రహ్మాండమైన పథకాలు తెచ్చింది. ఒక్క రైతులు, వ్యవయాసానికే కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు రూ.4.50లక్షల కోట్లు. రైతుబంధు రూపంలో రూ.73వేలుకోట్లు, రుణమాఫీ కోసం రూ.28వేలకోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయ పనిముట్ల రూపంలో, సబ్సిడీ, ఉచిత విద్యుత్ రూపంలో రూ.4.50లక్షలకోట్లు తెలంగాణలోని 70లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్గా నిలిచింది. కానీ, గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నరు.. భారతదేశంలో రేవంత్రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందట. 14 నెల్లలో పంటలు ఎండబెట్టడం వల్ల.. రైతుబంధు ఇవ్వకపోవడం వల్ల.. కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా? ప్రభుత్వానికి మాట్లాడేందుకు సిగ్గు ఉండాలి. కనీసం సోయన్నా ఉండాలి’ అంటూ ఘాటుగా స్పందించారు.
రైతులను ఓదార్చేందుకు ఒక్క మంత్రి దిక్కులేడు
‘ఇవాళ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే.. కనీసం ఓదార్చేందుకు ఒక మంత్రి దిక్కులేడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. ఊళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరిమి తరిమి కొడుతున్నరు. ఏదీ రైతుబంధు? ఏదీ రుణమాఫీ ? ఎక్కడ సచ్చిన్రు మీరంతా ? అంటూ తరిమితరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ ప్రసంగం ద్వారా చేశారు. 1.62లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్క పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్రెడ్డి ప్రభుత్వం. కేవలం కుంభకోణాలు, 20శాతం కమీషన్లు, 30శాతం ల్యాండ్ డీల్స్. ఇవి నా మాట కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నరు. 30శాతం కమీషన్ ఇస్తేనే తమ మంత్రులు పని చేస్తరు.. 20శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు వస్తయని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటి నుంచి వెంట వస్తున్న మాటలు. కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నాలు చేస్తున్న దుస్థితి గురించి గవర్నర్ ఏమన్నా చెబుతారేమోనని.. అవినీతిరహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాం.. ఢిల్లీకి మూటలు పంపేదాంట్లో బిజీగా ఉన్నా.. పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాం.. సరి చేసుకుంటామని ఒక్కమాట చెబుతారని అనుకున్నా.. దాని ప్రస్తావనలేదు’ అంటూ మండిపడ్డారు.