సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : చెల్లని రూపాయికి గీతలెక్కువ అని.. చేతకాని రేవంత్రెడ్డి చిల్లర ప్రచారాలు, చిల్లర వేషాలు ఎక్కువ అయ్యాయంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్న తెలుగు వైబ్ ట్విట్టర్ హ్యాండిల్పై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్, సైబర్ క్రైమ్ స్టేషన్లో దాసోజు శ్రావణ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, కురువ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ తెలుగు వైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ సృష్టించి బీఆర్ఎస్ నేతలు, నాయకత్వంపై కాంగ్రెస్ చిల్లర ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్రావుల మధ్య విభేదాలు ఉన్నట్లుగా విష ప్రచారం చేస్తోందన్నారు. హరీశ్రావు, కేసీఆర్పై తప్పుడు పోస్టులు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ను బద్నామ్ చేయాలని రేవంత్రెడ్డి కుట్రకు తెరలేపారని ఆరోపించారు. బీఆర్ఎస్ కేడర్ మనోస్థయిర్యాన్ని అబద్ధపు కథనాలతో దెబ్బతీస్తున్న తెలుగు వైబ్పై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని.. దాని వెనుకున్న వ్యక్తులను గుర్తించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరామన్నారు.
హరీశ్రావు ప్రతిష్ట దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి హరీశ్రావు ప్రతిష్ట దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమ నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్పై అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదన్నారు. కనీసం ఈ రోజు తాము ఇస్తున్న ఫిర్యాదు ఆధారంగానైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఎన్ని దారుణాలు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిపై వరుసగా కేసులు పెడుతున్నారని.. కొందరిపై మళ్లీ.. మళ్లీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు వెంటనే నిస్పాక్షిక చర్యలు చేపట్టాలని.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. గతంలో కేటీఆర్పై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు స్పందించాయన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.