దేశంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ విమానం వీల్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపు చేశారు.
250 మంది హజ్ యాత్రికులతో సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన ఎస్వీ 3112 ఫ్లైట్ శనివారం రాత్రి 10:45 గంటలకు జెడ్డా నుంచి బయల్దేరి వచ్చింది. ఆదివారం ఉదయం 6:30 గంటలకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ల్యాండ్ అయ్యింది. అయితే, విమానం ల్యాండ్ కాగానే ఫ్లైట్ ఎడమవైపు వీల్ నుంచి మంటలు, పొగ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ ఏటీసీని అలర్ట్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాలిక్ లీక్ వల్ల ఓవర్ హీట్ అయి ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, గత వారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరి విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్పై కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.