సత్యమేవ జయతే – మునిపల్లి
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యదర్శి ప్రజల వద్ద లంచాలు తీసుకుంటూ ఉంటే ప్రజల సమస్యలు పరిష్కరించేదెవరు… ప్రజల సమస్యలను పట్టించుకునేది ఎవరు..? అని మునిపల్లి మండల వాసులు సంబంధిత అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో ఓ వ్యక్తి రేకుల షెడ్డు నిర్మాణంతోపాటు కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకొని బుదేరా పంచాయతీ కార్యదర్శి వద్దకు పోతే రూ.12 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని.. లేకపోతే కాదు అని తెగించి చెప్పింది. దీంతో బాధితుడు పంచాయతీ కార్యదర్శితో రూ.8 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే సోమవారం మండల పరిధిలోని బుదేరా పంచాయతీ కార్యాలయంలో బాధితుడి వద్ద కార్యదర్శి నాగలక్ష్మి రూపాయలు రూ. 8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కినట్లు మెదక్ రేంజ్ డిఎస్పి సుదర్శన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారి మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి ఏసీబీకి పట్టుబడిన అనంతరం సంబంధిత పంచాయతీ రికార్డులు చూపించాలంటూ పంచాయతీ కార్యదర్శికి ఏసీబీ అధికారులు అడుగగా రికార్డులు చూపించకపోవడంతో పంచాయతీ కార్యదర్శిపై అనుమానం వచ్చి మండల పరిషత్ కార్యాలయానికి తరలించి వివరాలు సేకరించారు.
– గత 15ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ..
మునిపల్లి మండలంలో నాగలక్ష్మి పంచాయతీ కార్యదర్శిగా గత 15ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వివిధ పనులు నిమిత్తం వచ్చే వారి దగ్గర లంచం అడిగేవారని పలువురు అధికారులు దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకొని విధులు చేపడితే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండలంలోని బుదేరా పంచాయతీ కార్యదర్శి చాలా మంది దగ్గర డబ్బులు డిమాండ్ చేసే వాళ్లని సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ పట్టుబడిన అనంతరం మండల కేంద్రమైన మునిపల్లి మండల పరిషత్ కార్యాలయానికి తీసుకువస్తే సంబంధిత మండల అభివృద్ధి అధికారి అందుబాటులో లేకపోవడం విచిత్రంగా ఉంది. ఏసీబీ అధికారులు మండల కేంద్రానికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు వాపోతున్నారు