– అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే కేంద్రాన్ని రంగంలోకి దించుతాం!
– మా విచక్షణాధికారాల్ని వినియోగించక తప్పదు
– గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం,
– జీహెచ్ఎంసీకి హైకోర్టు హెచ్చరిక
సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : కోర్టు గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, తమ ఆదేశాల అమలుకు కేం ద్రానికి ఆదేశాలు జారీచేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దించక తప్పదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోర్టు గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, తమ ఆదేశాల అమలుకు కేం ద్రానికి ఆదేశాలు జారీచేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి పరిధిలోని సర్వే నంబర్లు 51, 52, 53లో అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే తీవ్రచర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీని హెచ్చరించింది. మార్చి 7 నాటికి అక్రమ నిర్మాణాలను తొలగించి, స్థాయీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించకతప్పదని పేర్కొంది. గచ్చిబౌలిలోని సర్వే నంబర్లు 51, 52, 53లోని భూముల్లో నిర్మాణాలపై స్టేట్సకో ఆదేశాలు ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలకు అనుమతిస్తున్నారని హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వర్చువల్గా హాజరై భవన నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాల తొలగింపులో తమ ప్రమేయం ఉండదని తెలిపారు.
దీంతో ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని జీహెచ్ఎంసీ అధికారులు కౌంటర్లో పేర్కొన్నారని.. పిటిషనర్ మాత్రం అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని అంటున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘తాజాగా స్థాయీ నివేదిక ఇవ్వాలని పలుమార్లు ఆదేశాలిచ్చి నా అధికారులు అమలు చేయడం లేదు. అందుకే ప్రత్యక్ష హాజరుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషనర్ పేర్కొంటున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయంటే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. వచ్చే విచారణ తేదీ నాటికి పూర్తి గా అక్రమ నిర్మాణాలను తొలగించి.. స్థాయీ నివేది క సమర్పించాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ మార్చి 7కు వాయిదా వేసింది.