ఇస్లామాబాద్: చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా భారత్, పాకిస్థాన్ వ్యవహారం ఉన్నది. న్యూఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నాడని పేర్కొంటూ.. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రతిగా పాకిస్థాన్ కూడా ఇస్లామాబాద్లోని ఓ భారత దౌత్యవేత్తకు సమన్లు జారీచేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించింది.
ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారికి పాక్ విదేశాంగ శాఖ నోటీసులు జారీచేసింది. తన ప్రత్యేక హోదాకు విరుద్ధంగా కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఆయనను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. అధికార దుర్వినియోగాని పాల్పడ్డారని, ఇది ఆయన దౌత్య హోదాకు విరుద్ధంగా ఉందని వెల్లడించింది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలంటూ అందులో పేర్కొంది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు పర్సోనా నాన్ గ్రాటా నోటీసులు జారీచేస్తారు.
కాగా, ఇప్పటికే న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారిని భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. అతను 24 గంటల్లో భారత్ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ అనంతరం ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ అధికారి కార్యకలాపాలపై న్యూఢిల్లీలోని పాకిస్థాన్ డీ అఫైర్స్కు తెలియజేసింది.