న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో పాకిస్థాన్లోని కీలకమైన ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. రావల్పిండిలోని చక్లాలాలో ఉన్న పాక్ వైమానిక స్థావరం నూర్ ఖాన్కు బాగా నష్టం వాటిల్లింది. చైనా ఉపగ్రహ సంస్థ మిజాజ్విజన్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు దీనిని నిర్ధారించాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో పాటు రఫీకి, మురిద్, చునియన్, సుక్కూర్లోని పాకిస్థాన్ మానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది.
కాగా, కీలకమైన పాకిస్థాన్ ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అంగీకరించారు. దేశాన్ని ఉద్దేశించి టీవీలో మాట్లాడిన ఆయన, రావల్పిండిలోని నూర్ ఖాన్ బేస్, చక్వాల్లోని మురిద్ బేస్, పంజాబ్ ప్రావిన్స్లోని రఫీకి బేస్పై భారత క్షిపణుల దాడి జరిగిందని తెలిపారు.
మరోవైపు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఉంది. ఆ దేశ ప్రధాన రవాణా స్క్వాడ్రన్లు ఇక్కడ ఉన్నాయి. లాజిస్టిక్, వ్యూహాత్మక ఎయిర్లిఫ్ట్ కార్యకలాపాలకు ఈ బేస్ను పాక్ వినియోగిస్తున్నది. సీ-130 హెర్క్యులస్, శాబ్ 2000 వంటి రవాణా విమానాలు, ఐఎల్-78 మిడ్-ఎయిర్ రీఫ్యూయలర్లు, వీఐపీల విమానాలు కూడా ఈ ఎయిర్ బేస్లోనే ఉన్నాయి. ఇంతటి కీలకమైన ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేయడంతో పాకిస్థాన్ తోకముడిచింది. కాల్పుల విరమణ కోసం భారత్తో సంప్రదింపులు జరిపింది.