న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. పాకిస్థాన్లోని బహవల్పూర్లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (జేఏఎమ్) ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని బ్రహ్మోస్ క్షిపణితో ధ్వంసం చేసినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బ్రహ్మోస్ క్షిపణి బూస్టర్, ఇతర భాగాల శకలాలు లభించాయి.
కాగా, భారత్, పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న మారుమూల ప్రాంతం నుంచి బ్రహ్మోస్ క్షిపణి శిథిలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై జరిగిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ వినియోగించినట్లు స్పష్టమైంది. అయితే ఆర్మీ వర్గాలు దీనిని ధృవీకరించలేదు.
మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. సుమారు వంద మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మరణించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.