పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్తో గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్కు చెందిన వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు. 2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి వెనుక తమ హస్తం ఉందని మీడియా సాక్షిగా అంగీకరించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో ఆయన ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.
‘పాకిస్థాన్ జలాలు, భూభాగం, గగనతలానికి, ప్రజలకు ఎవరైనా ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే తాము సహించబోం. అలాంటి చర్యల్ని ఎన్నటికీ ఉపేక్షించబోం. వాటిని ఎదుర్కొనేందుకు మేం రాజీ పడం. దేశ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయం. ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా పుల్వామా దాడితో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఔరంగజేబ్ అహ్మద్తోపాటు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ, నేవీ అధికార ప్రతినిధి కూడా పాల్గొన్నారు. అయితే, ఔరంగజేబ్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న విషయం మరోసారి బట్టబయలైంది.
పుల్వామా దాడి..
2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయిని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఉగ్రదాడి జరగడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇది జరిగిన సరిగ్గా 12 రోజులకు.. అంటే 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖ (ఎల్ఓసి)ను దాటి పాకిస్థాన్ వైపున ఉన్న బాలాకోట్లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది.
పాకిస్థాన్ ఈశాన్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తున్ఖ్వా తీవ్రవాదుల అడ్డాను తునాతునకలు చేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్లో చాలా మంది ముష్కరులు చనిపోయినప్పటికీ పాకిస్థాన్ మిన్నకుండి పోయింది. మరుసటి రోజు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం పాకిస్థాన్ చేసింది. పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 కూల్చివేసింది. పాకిస్థాన్ కూడా మన మిగ్-21 విమానాన్ని కూల్చివేసి, వింగ్ కమాండర్ అభినందన్ను అరెస్టు చేసింది. అయితే మూడు వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్ ప్రభుత్వం రెండు రోజుల తర్వాత అభినందన్ను క్షేమంగా భారత్కు అప్పగించింది.