భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ .. ప్రధాని మోదికి లేఖ రాశారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా దీనిపై ప్రకటన చెయ్యడం వంటి అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం మనముందున్న సవాళ్లను ఎదుర్కోడానికి, సమిష్టి సంకల్పాన్సి ప్రదర్శించడానికి ఈ సమావేశం ఒక అవకాశంగా రాహుల్ పేర్కొన్నారు.
మరోవైపు భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీలన్నింటికి జరిగిన పరిణామాలను వివరించాలని కోరింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం గడిచిన 18 రోజులుగా జరిగిన పరిణామాలు, కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని పేర్కొంది.