ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. ఇవాళ ఉదయం కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోదీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి. జీ7 సదస్సు కోసం ప్రధాని కెనడా వెళ్లారు.
జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలో జీ7 దేశాల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీకి కెనడా నుంచి గతవారం ఆహ్వానం అందింది. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ.. మోదీకి ఫోన్ చేసి సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ప్రధాని కెనడా వెళ్లారు. జీ7 సదస్సులో పాల్గొననున్నారు. భారత్-కెనడా మధ్య నెలకొన్న విభేదాల కారణంగా జీ 7 సమ్మిట్కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఈ సదస్సులో పాల్గొనాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు ఇటీవలే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.