ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని వ్యాఖ్యానించారు.
రెజాయి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ఇస్లామాబాద్ తాజాగా స్పందించింది. రెజాయి వ్యాఖ్యలను పాక్ కొట్టిపారేసింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టతనిచ్చారు. అణు దాడికి సంబంధించి ఇరాన్కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఇజ్రాయెల్తో జరుగుతున్న విస్తృత వివాదంలో ఇరాన్కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
‘ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు మా మద్దతు తెలిపాం. అణుదాడి మామీ ఇవ్వలేదు. అణు ఆయుధాలను కేవలం మా ప్రజలు, మా దేశ రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అప్రకటిత అణ్వాయుధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విస్తృత ప్రాంతీయ సంఘర్షణను మరింత పెంచుతుందని వ్యాఖ్యానించారు.
ఇరాన్ ప్రభుత్వం అధీనంలోని ఓ టెలివిజన్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయి మాట్లాడుతూ.. ‘ఇజ్రాయెల్ మాపై అణుదాడి చేస్తే.. పాకిస్థాన్ ఇజ్రాయెల్పై అణుబాంబును ప్రయోగిస్తుంది. ఈ మేరకు పాకిస్థాన్ నుంచి మాకు హామీ ఉంది’ అని మొహసిన్ వ్యాఖ్యానించారు. టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ ప్రతిపాదించారు. కానీ ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవని వ్యాఖ్యానించారు. ఒక్క ఇస్లామిక్ దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. కాగా ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల జాబితాలో ఇజ్రాయెల్, పాకిస్థాన్ దేశాలు స్థానం దక్కించుకొన్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా ఉన్నాయి.