సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయని.. వాటిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదని.. గడిచిన ఐదు సంవత్సరాలలో 40 కోట్లు ఖర్చు చేశామని.. అయిన సరైన ఫలితం ఇవ్వలేదని అందుకే కుక్కలను చంపేందుకు మాకు అనుమతి కల్పించండి అంటూ జీహెచ్ఎంసీ హైకోర్టులో అఫిడివేట్ దాఖలు చేసింది. కుక్కల నియంత్రణకు గడిచిన ఐదు సంవత్సరాలలో జీహెచ్ఎంసీ సుమారు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, ప్రజలకు అవగాహన కోసం ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. సంస్థ నేరుగా 29.66 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, యానిమల్ వెల్ఫేర్ సంస్థల ద్వారా గత ఐదేళ్లలో మరో 9.21 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల్లో ప్రతీ యేటా 35 వేల నుంచి 40 వేలకు పైగా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కుక్క కాటు కేసుల్లో 30 శాతం గ్రేటర్లోని ఉన్నాయి. క్రూరంగా ప్రవర్తించే కుక్కలను చంపేందుకు అనుమతించాలంటూ హైకోర్టుకు జీహెచ్ఎంసీ విన్నవించింది. ఈ మేరకు న్యాయస్థానానికి సమర్పించిన అదనపు అఫిడవిట్లో వీధి కుక్కల నియంత్రణకు నిరంతరాయంగా పని చేస్తున్నాం. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కానీ కుక్క కాట్లతో ప్రాణాలు పోతున్నాయని కోర్టుకు వివరించింది. ప్రజలపై దాడి చేసే, వారి ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ప్రమాదకర కుక్కల విషయంలో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సిఫారసులు, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ యాక్ట్ 1960 ప్రకారం ముందుకెళ్లాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. స్టెరిలైజేషన్ చేసినా కొన్ని కుక్కలు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయని, వాటి ప్రవర్తన మారేలా శిక్షణ ఇచ్చి అప్పటికీ మారకపోతే 1960 చట్టంలోని 11(3) బి,(2), 11(3)సీ సెక్షన్ల ప్రకారం వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో కుక్కలను చంపే(డిస్ట్రాయ్) వెసులుబాటు ఉందని హైకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్లో జీహెచ్ఎంసీ పేర్కొంది.
కుక్కలు దాడులు చేస్తుండడంతో పెద్దవారితో పాటు పిల్లలు కూడా చనిపోతున్నారు. కొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. వారిని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. మరో ప్రత్యామ్నాయం లేకనే ఎతునేషియాకు అనుమతించాలని కోరుతున్నామని అఫిడవిట్లో జీహెచ్ఎంసీ వివరించింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, చట్టంలో సూచించిన ప్రకారమే ఈ ప్రక్రియ చేపడతామని కమిషనర్ పేరిట అఫిడవిట్లో పొందుపర్చారు. అంబర్పేటలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. అఫిడవిట్లో వెల్లడించిన అంశాలు, కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో జీహెచ్ఎంసీ మరిన్ని అంశాలను ప్రస్తావించింది. వీధి కుక్కల నియంత్రణకు నిరంతరాయంగా పనిచేస్తున్నాం. యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ), యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ఇందుకోసం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం. జీహెచ్ఎంసీలోని వెటర్నరీ విభాగంతో పాటు ఎన్జీఓలనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశాం. ఐదు ఏబీసీ కేంద్రాలు, 18 మంది ప్రైవేట్ వెటర్నరీ వైద్యులు, 22 మంది పారా వెటర్నేరియన్లు, ఆరుగురు షెల్టర్ మెనేజర్లు, 362 మంది కుక్కలు పట్టుకునే సిబ్బంది పని చేస్తున్నారు. 49 కుక్కలు పట్టుకునే వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కుక్క కాటు కేసుల ఆధారంగా హాట్ స్పాట్లు గుర్తించి ఆ ఏరియాల్లో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేస్తున్నాం. పాఠశాలలు, మూసీ తీర ప్రాంతాలు, ఆర్మీ ఏరియాలు, ఆట స్థలాలున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. కుక్కల దాడి నుంచి కాపాడుకునేందుకు ఏం చేయాలనే దానిపై 1,887 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 3,97,015 మంది విద్యార్థులకు అవగాహన కల్పించాం. గ్రేటర్ లో 80 శాతానికిపైగా కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ జరిగింది. అయినా వాటి నియంత్రణ ఆగడం లేదని హై కోర్టుకు విన్నవించిన జీహెచ్ఎంసీ.
రేబిస్ సోకిన, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన, స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. వ్యక్తులపై దాడి చేయడంతోపాటు రోడ్డు ప్రమాదాలకూ కారణమవుతున్నాయి. ప్రపంచంలో నమోదవుతోన్న రేబిస్ మరణాల్లో 36 శాతం మన దేశంలోనే అని పేర్కొన్నారు. యూకే, యూఎస్ఏ వంటి ఇతర దేశాల్లో అమలులో ఉన్న చట్టాలనూ జీహెచ్ఎంసీ కోర్టు ముందుంచింది. యూకే పర్యావరణ పరిరక్షణ చట్టం 1990 ప్రకారం పబ్లిక్ స్థలాల్లో కనిపించిన వీధి కుక్కలను నిర్బంధిస్తారు. వాటి మెడపట్టిపై ఉండే వివరాల ఆధారంగా సంబంధించిన అధికారి లేఖ రాస్తాడు. ‘మీ కుక్కను నిర్బంధించాం. ఫలాన చోట ఉంచాం. నోటీసు అందిన ఏడు పని దినాల్లో వచ్చి తీసుకెళ్లండి’ అని సూచిస్తారు. కుక్కను పట్టుకునేందుకు, దాని తిండి ఖర్చుతోపాటు, ఇతరత్రా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో స్పందించకపోతే ఆ కుక్కలను ఇతరులకు విక్రయిస్తారు. మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారినప్పుడు చట్టప్రకారం ఎతునేషియాకు అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్ర చట్టాల ప్రకారం ఎతునేషియా ద్వారా ప్రమాదకర/ప్రాణాంతక కుక్కలను చంపడం చట్టబద్ధమే అని పేర్కొన్నారు. ఎతునేషియా అంటే.. శస్త్రచికిత్సల సమయంలో మత్తు కోసం ఇచ్చే సోడియం పెంటోబార్బిటల్ ఇంజక్షన్ను ఎక్కువ మోతాదులో ఇవ్వడం, దీంతో కోమాలోకి వెళ్లిన కుక్కలు అనంతరం చనిపోతాయి. శారీరకంగా హింసించకుండా ఈ విధానం వినియోగిస్తారు.