ఇండొనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియాలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది మంగళవారం సాయంత్రం విష్ఫోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి 10 వేల మీటర్లు (32,800 అడుగుల మేర) కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడుతోంది. భూమిని, ఆకాశాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తున్నది.
దీంతో విమాన సర్వీసుకుల తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అగ్నిపర్వతం విష్ఫోటనం కారణంగా బాలి కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది. అంతేకాదు పలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అనేక విమానాలు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, 1,584 మీటర్ల (5,197 అడుగులు) ఎత్తున్న లకిలకి అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉన్నది. ఈ ఏడాది మార్చి 21న విస్ఫోటనం చెందింది. గతేడాది నవంబర్లో కూడా బద్ధలైంది.
కాగా, ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలోపడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా 60 మందికిపైగా మరణించారు. సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించారు. మరోవైపు ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు.