– రెండున్నరేళ్లలో మామునూరు విమానాశ్రయం
– కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడు ఈ మేరకు హామీలు ఇచ్చారు
– అనర్హత భయంతోనే అసెంబ్లీకి కేసీఆర్
– బీఆర్ఎస్ ఇక గతమే.. మరో పదేళ్లు రేవంతే సీఎం ఢిల్లీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి
సత్యమేవ జయతే – న్యూఢిల్లీ
న్యూఢిల్లీ : రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన పెండింగ్ అంశాలను పూర్తిచేసి, పనులను ప్రారంభించేలా చూస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిని గడ్కరీ, రామ్మోహన్ నాయుడులను వేర్వేరుగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. ఆయా పనులను వేగవంతం చేయాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..భేటీల వివరాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్కు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించేలా చూడాలని గడ్కరీని కోరినట్లు వివరించారు. ‘‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి గత ఏడాది డిసెంబరు 27న రూ.7,100 కోట్లతో ఐదు ప్యాకేజీలుగా టెండర్లను పిలిచారు. అటవీ అనుమతులను వేగవంతం చేయాలని, ఆర్థిక త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయాలని గడ్కరీని కోరాం. చౌటుప్పల్-అమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి మీదుగా నిర్మిస్తున్న దక్షిణ భాగం అలైన్మెంట్ను ఖరారు చేయాలని విన్నవించాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్
‘‘హైదరాబాద్-శ్రీశైలం 187 కిలోమీటర్ల రహదారిలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా 62 కిలోమీటర్ల ఎలివేటెడెట్ కారిడార్ నిర్మించాలి. అటవీ ప్రాంతం కావడంతో అనుమతుల్లేక ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలివేటెడ్ కారిడార్ సౌకర్యవంతంగా ఉంటుంది’’ అని గడ్కరీని కోమటిరెడ్డి కోరారు. ఎలివేటెడ్ కారిడార్తోపాటు.. సోమశిల కేబుల్ బ్రిడ్జికి టెండర్లను ఆహ్వానించేందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. ‘‘పర్వతమాల కింద తెలంగాణకు ఎటువంటి ప్రాజెక్టులు లేవు. ఈ నేపథ్యంలో.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రెండు కిలోమీటర్లు, భువనగిరి కోటకు కిలోమీటరు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండకు రెండు కిలోమీటర్లు, నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జునకొండను కలుపుతూ ఐదు కిలోమీటర్లు, మంథనిలోని రామగిరి కోటకు రెండు కిలోమీటర్ల రోప్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలి’’ అంటూ కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఆర్ఐఎ్ఫ-సేతుబంధు పథకం కింద రూ.887.45 కోట్ల విలువైన 12 రహదారి పనులను మంజూరు చేయాలని, దీనిపై గత ఏడాది జూన్ 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాశారని కోమట్రెడ్డి గుర్తుచేశారు. అవి పెండింగ్లోనే ఉన్నాయని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో సేతుబంధన్ పథకం కింద ప్రతిపాదిత 12 ప్రాజెక్టులు మంజూరు చేయాలని గడ్కరీని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన జాతీయ రహదారి ఎన్హెచ్-65పై ట్రాఫిక్ విపరీతంగా ఉందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దానిని ఆరులేన్లుగా విస్తరించాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి గడ్కరీ స్పందిస్తూ.. రెండు ప్యాకేజీలుగా మచిలీపట్నం వరకు ఈ రహదారిని విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయం మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్కు వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భూసేకరణ కోసం రూ.205 కోట్లను మంజూరు చేశామని వివరించారు. 15 రోజుల్లో భూసేకరణ పూర్తవుతుందని చెప్పారు. రెండున్నరేళ్లలో విమానాశ్రయాన్ని పూర్తిచేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని వెంకటరెడ్డి తెలిపారు.
కేసీఆర్పై విమర్శలు
మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో ఇష్టాగోష్ఠీగా మాట్లాడుతూ.. కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. అనర్హత వేటు పడుతుందనే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అనేది గతం అని.. బ్రహ్మదేవుడు దిగి వచ్చినా.. ఆ పార్టీని కాపాడలేరన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే.. మేం పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత ముఖ్యమంత్రి మొదలు.. ఎన్నో హామీలను కేసీఆర్ గంగలో కలిపేశారు. అసెంబ్లీలో వాటన్నింటినీ ఎండగడతాం’’ అని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలబెట్టకుండా.. బీజేపీకి ఓట్లు వేయించారని మండిపడ్డారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. మరో పదేళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం మార్పు అనేది అసత్య ప్రచారమన్నారు.