న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో చేపట్టిన సైనిక దాడుల వల్ల భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. గత నాలుగు రోజులుగా సరిహద్దుల్లో పాక్ పాల్పడిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ ఎదురు దాడుల్లో పాకిస్థాన్ సైన్యానికి భారీగా నష్టం వాటిల్లింది. శనివారం భారత వైమానిక దాడుల్లో పాకిస్థాన్కు చెందిన ఎనిమిది కీలక ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అలాగే పూర్తిస్థాయి యుద్ధానికి భారత్ సన్నద్ధమైంది. పాక్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని భారత్ తిప్పటికొట్టింది. అలాగే అంతర్జాతీయంగాను పాక్ వైఖరిని ఎండగట్టింది.
కాగా, సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాకిస్థాన్ చతికిలపడింది. దాడులతో భారత్ను ఎదుర్కొవడం కష్టమని భావించింది. అసత్య ప్రచారంపైనా బోర్లాపడింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగడంతో చేతులు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో రాజీ కోసం పాక్ ముందుకువచ్చింది. పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్కు ఫోన్ చేశారు. వైమానిక దాడులు, కాల్పులు ఆపాలని ప్రతిపాదించారు. దీంతో భారత్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. అలాగే మే 12న భారత్, పాక్ మధ్య చర్చలు జరుగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు అమెరికాతో సహా పలు దేశాలు భారత్, పాకిస్థాన్తో నిరంతరం సంప్రదింపులు జరిపాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సహా భారత ఉన్నతాధికారులతో అమెరికా, ఇతర దేశాల అధినేతలు మాట్లాడారు. అయితే భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు, ఎన్ఎస్ఏల మధ్య ఎలాంటి ఎలాంటి చర్చలు జరుగలేదని ఆ వర్గాలు వెల్లడించాయి.
కాగా, కాల్పుల విరమణకు ఎలాంటి షరతులు లేవని అధికారులు తెలిపారు. సింధు జల ఒప్పందం, వాణిజ్య ఆంక్షలు, దేశం నుంచి పాక్ పౌరులు వైదొలగడం సహా పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత్ ప్రకటించిన చర్యల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. భవిష్యత్తులో జరిగే ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యగా భావిస్తామని కూడా భారత్ స్పష్టం చేసిందన్నారు.