హైదరాబాద్లో పోలీసులు మరోసారి అత్యుత్సాహం చూపించారు. తెలంగాణ భవన్ సమీపంలో బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 12లో ఉన్న నిలోఫర్ కేఫ్ను ఉన్నపళంగా మూసివేయించారు. కేఫ్ లోపల ఛాయ్ తాగుతున్న కస్టమర్లను కూడా బలవంతంగా బయటకు నెట్టుకొచ్చి అక్కడి నుంచి పంపించేశారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణ భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం గేటు వద్దే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు నిలోఫర్ కేఫ్ దగ్గర గుమిగూడే అవకాశం ఉందని భావించిన పోలీసులు అత్యుత్సాహం చూపించారు.నిలోఫర్ కేఫ్లో ఛాయ్ తాగుతున్న వారిని బలవంతంగా బయటకు పంపించేశారు. అనంతరం కేఫ్ను మూసివేశారు. దీన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను కూడా అక్కడి నుంచి పంపిచేశారు. అలాగే కేఫ్ సమీపంలో కనిపించిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.